కథలు




1978 శంకరమంచి మొదటి కథ స్వాతిలో ప్రచురితమయ్యింది. ఇప్పటి వరకూ దాదాపు 200 లకి పైగా కథలు స్వాతి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, చతుర, ఉదయం వంటి అన్ని వార మాస పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ఆంధ్రజ్యోతి, స్వాతి, ఉదయం పత్రికల్లో కథలకు బహుమతులు అందుకున్నారు. శంకరమంచి తన కథల్లో కుటుంబ జీవనంలోని విలువలకు, స్త్రీ సమస్యలకు ప్రాధాన్యమిచ్చారు. అనాది నుండి ఆధునిక కాలం వరకూ స్త్రీ ఎదుర్కొంటున్న వివక్ష, పడుతున్న బాధలు వీరి రచనల్లో చర్చకి వస్తాయి. నేటిప్రపంచం ఇంతటి ప్రగతి సాధించినా మహిళల కష్టాలు తగ్గకపోగా మరింత పెరగడం ఆయన్ని బాధిస్తోంటుంది. స్త్రీ అంటే ఎంతో గౌరవం శంకరమంచికి. ఈ విషయం ఆయన రచనల్లో ప్రతిబింబిస్తూంటుంది.

1978లో "గోళ్ళ రంగు" కథ ఆంధ్రజ్యోతి పత్రిక దీపావళి కథల పోటీలో ప్రధమ బహుమతి కైవసం చేసుకుంది.

స్వాతి సపరివారపత్రిక ప్రారంభసంచికలో నిర్వహించిన కథల పోటీలో "మొగుడు" అనే కథకి ప్రథమ బహుమతి లభించింది.

ఆంధ్రజ్యోతి వారపత్రిక నిర్వహించిన సస్పెన్స్ కథల పోటీలో "ఉష్!" అనే కథకు ప్రథమ బహుమతి లభించింది.

స్వాతి సపరివార పత్రిక నిర్వహించిన హాస్యకథల పోటీలో "సోమరాజు సీక్రెట్" అనే కథ మొదటి బహుమతి అందుకుంది.

శంకరమంచి పలు నవలలు కూడా రాసారు. వీటిలో "స్వర్గంలో బందీలు" అనే నవలకి స్వాతి అనిల్ అవార్డు లభించింది.

వీరి నవలల్లో కొన్ని:

ప్రేమకావ్యం (చతుర)

శ్రమదేవోభవ (ఉదయం వారపత్రిక)

స్నేక్ పార్క్ (స్వాతి మాస పత్రికలో దాదాపు యేడాదిన్నర సీరియల్ గా వచ్చింది)

స్వర్గంలో బందీలు (స్వాతి మాసపత్రిక)